వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి విజయంసాధించి అధికారంలోకి రావడమే లక్ష్యంగా భిన్నమైన వ్యూహాలతో ప్రస్తుతం ముందుకు వెళుతోంది. కేవలం విజయావకాశాలే ప్రాతిపదికగా తనకు వ్యక్తిగతంగా సన్నిహితులు, ఆప్తులు.. అయినా కూడా అభ్యర్థులను, ఇన్చార్జిలను నిర్మొహమాటంగా మార్చేస్తూ.. జగన్ ఖరాఖండిగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో.. పదవులు హోదాలు కోల్పోతున్న వారిని బుజ్జగించడానికి పార్టీకి విశ్వసనీయులైన సీనియర్లతో ఒక పెద్ద యంత్రాంగ వ్యవస్థ నడుస్తోంది.
ప్రస్తుతానికి తిరుగుబాటుస్థాయిలో అసంతృప్తులు ఎక్కడా బయటపడడం లేదు. బుజ్జగింపులు ఫలిస్తున్నట్టుగానే కనిపిస్తున్నాయి. అయితే.. ఈ వాతావరణాన్ని ఏకపక్షంగా నమ్మడానికి కూడా వీల్లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. సొంత పార్టీ నాయకుల్లో అసంతృప్తి అనేది నివురుగప్పిన నిప్పులా ఉన్నదని, సరిగ్గా ఎన్నికల ముంగిట్లో అది బయటపడే ప్రమాదం ఉన్నదని, పార్టీ అధినేత అప్రమత్తంగా ఉండాలని పలువురు భావిస్తున్నారు.
కొన్ని నియోజకవర్గాల్లో ఇన్చార్జిల మార్పు ఇప్పటికే జరిగిపోయింది. ఇంకా అనేక నియోజకవర్గాల్లో ఇలాంటి మార్పులుంటాయనే ప్రచారం జరుగుతోంది. ఫలితంగా దాదాపుగా ప్రతి చోటా కూడా, ఆశలు భంగపడిన వారు తప్పకుండా ఉంటారు. అయితే ఇక్కడ ఒక ట్విస్టు కనిపిస్తోంది. అసంతృప్తులు ఎవ్వరూ కూడా పార్టీని వీడిపోయే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. అలాగని వారిని నమ్మడానికి కూడా లేదు.
ఉదాహరణకి మోపిదేవి వెంకటరమణకి జగన్మోహన రెడ్డి చాలా అవకాశాలు ఇచ్చారు. తన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆయనను మంత్రిని చేశారు. ఆ తర్వాత ఎంపీ చేసి రాజ్యసభకు పంపారు. ఆయనను మొన్నటిదాకా రేపల్లె నియోజకవర్గ ఇన్చార్జిగా ఉంచిన జగన్.. తాజా వ్యూహాల్లో ఆ పదవిని ఈపూర్ గణేష్ కు అప్పగించారు. మోపిదేవి అనుచరుల్లో కాస్త అసంతృప్తి ఉంది. మోపిదేవి సర్దుకున్నట్టే కనిపించారు.
అయితే తాజాగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ బయటపడిపోయారు. రాజకీయాల్లో కొనసాగాలంటే ఇష్టంలేని వారితో కూడా కలిసి పనిచేయాల్సి వస్తుందంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. మోపిదేవి ఒక్కరే కాదు. మార్పు చేర్పులు జరుగుతున్న ప్రతి చోటా కూడా.. ఆసంతృప్తితో రగులుతున్నవారు ఉన్నారు. పార్టీ మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో ఎవ్వరూ పార్టీ వీడిపోవడం లేదు.
ఇదే సమయంలో.. చంద్రబాబునాయుడు కుట్ర వ్యూహాలను తక్కువగా అంచనా వేయడానికి కూడా వీల్లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అసంతృప్త నాయకులను వైసీపీలోనే ఉంచి, కోవర్టులుగా వాడుకునే అలవాటు ఆయనకున్నదని అంటున్నారు. ఈ నేతలను వైసీపీలోనే ఉంచి, వారిద్వారా. వైసీపీ అభ్యర్థుల వెనుక గోతులు తవ్వించే ఏర్పాటు చేస్తారనే అనుమానాలు ఉన్నాయి. అందుకే బుజ్జగింపుల విషయంలో, అసంతృవుల విషయంలో పార్టీ అధిష్టానం మరింత అప్రమత్తంగా ఉండాలని పలువురు భావిస్తున్నారు.